ఇది గ్రాఫిక్స్‌ బడ్జెట్‌ : బుగ్గన

రాష్ట్ర అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ ప్రవేశపెట్టిన 2025–2026 వార్షిక బడ్జెట్‌ అంతా గ్రాఫిక్స్‌ అని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. ఏపీ అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై ఆయన స్పందించారు.


Published on: 28 Feb 2025 22:04  IST


తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గవర్నర్‌ ప్రసంగంలో సూపర్‌ సిక్స్‌ గురించి ఒక్క చోట కూడా చెప్పలేదన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు లేవు.. మిర్చి గత ఏడాది 21 వేల వరకు అమ్మితే ఇప్పుడు 8 నుంచి 10 వేల వరకు మాత్రమే ఉంది.. రైతులకు అన్నదాత సుఖీభవ మాత్రం రాలేదు.. మిమ్మల్ని నమ్మిన ఉద్యోగుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.. మా ప్రభుత్వంలో మొత్తం అన్నీ కలిపి 6.31 లక్షల ఉద్యోగాలు కల్పించాం.  కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తుంది.. ఇప్పటికీ కూడా గత ప్రభుత్వం మీదే ఎందుకు మాట్లాడుతున్నారు. బడ్జెట్‌ ప్రసంగంలో 25 సార్లు గత ప్రభుత్వం అని 10 సార్లు విధ్వంసమని మాట్లాడారు.. ఉన్నది ఒక్కటే ప్రతిపక్ష పార్టీ.. మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వం అన్నారు.. మీరు సుపరిపాలన చేయాలి కదా అని బుగ్గన రాజేంద్రనాథ్‌ ప్రశ్నించారు.

బడ్జెట్‌లో కంటెంట్‌ తక్కువ, కలర్‌ ఎక్కువ
చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా జీతాలు సరిగ్గా రావు అని మాజీ మంత్రి బుగ్గన అన్నారు. చంద్రబాబును ఓ చాణక్యుడు, కౌటిల్యుడు అని పోల్చారు.. మరి నాకు తెలిసి ఆయనకు ఏదీ సూట్‌ కాదు.. ఈసారి బడ్జెట్‌ కూడా సిస్టమాటిక్‌ గా పొందుపరచలేదు.. బడ్జెట్‌ బుక్‌ కలర్‌ ఎక్కువగా కంటెంట్‌ తక్కువగా ఉందని సెటైర్లు వేశారు. మాది ఒకటే సిద్ధాంతం.. వైయస్‌ఆర్‌ ది, వైయస్‌ జగన్‌ ది.. సింపుల్‌ లివింగ్‌.. సింపుల్‌ థింకింగ్‌ సిద్ధాంతం అన్నారు. కానీ, కూటమి ప్రభుత్వం గత ఐదేళ్ల పాలనను హేళన చేయటంతోనే సరిపోతుంది.. మేము అన్నీ డీబీటీ ద్వారానే చేశాం.. మమ్మల్ని ఇంత క్రిటిసైజ్‌ చేసి ఏదో జరిగిపోతుందని చెప్పి జనాల్ని నమ్మించారు.. మేము చెప్పింది చేయాలని భావించి కొన్ని చెప్పలేదు.. మీరు గెలవటానికి.. మేము ఓడటానికి అబద్ధాలే కారణం అని బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి వెల్లడించారు.

మీది  డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ కదా..?
కూటమి పాలనలో ప్రజలు అభద్రతాభావంతో బ్రతుకుతున్నారని బుగ్గన రాజేంద్రనాథ్‌ తెలిపారు. ఇవాళ గ్రామాల్లో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.. ప్రతీ ఇంట్లో వీళ్ళు ఇచ్చిన హామీ పత్రాలు తీసుకుని మోసపోయారు.. గ్రామాల్లో ప్రజలు అప్పులపాలయ్యారు.. సంపద సృష్టి ద్వారా మీరు గెలిస్తే ఓకే.. కానీ చెప్పినవన్నీ అబద్ధాలు.. మేము కోవిడ్‌ లో కూడా ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేశాం.. గత బడ్జెట్‌ లో చెప్పిన పెట్టుబడి సాయం ఎవరికైనా అందిందా అని అడిగారు. సూపర్‌ సిక్స్‌ లో చెప్పిన విధంగా ఒక్క గ్యాస్‌ సిలెండర్‌ తప్ప ఏమీ ఇవ్వలేదు.. వైయస్‌ జగన్‌ మ్యానిఫెస్టోను భగవద్గీతలా భావించాలని చెబుతారు.. రైతులకు ఏపీ ప్రభుత్వం తరఫున ఇరవై వేలు ఇస్తామని చెప్పారు.. ఇప్పుడు కేంద్ర నిధులతో కలిపి ఇస్తామంటున్నారు.. స్థూల ఉత్పత్తి విషయంలో అర్థం కానీ లెక్కలు చెబుతున్న చంద్రబాబు.. సంపద సృష్టించారు.. మీది అసలే డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌.. పేదలకు అన్నీ ఇవ్వొచ్చు కదా అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఎప్పుడు పీఠం ఎక్కినా రెవెన్యూ లోటు ఉంటుందని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. 


 

Source From: Buggana Rajendranadh

లేటెస్ట్ న్యూస్